ఎవరెవరితో పొత్తులు ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం: నాదెండ్ల మనోహర్

  • త్వరలోనే బీజేపీతో రోడ్ మ్యాప్ ఖరారవుతుందని వెల్లడి
  • వైసీపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణ జరుగుతుందని ధీమా
  • భవిష్యత్ దృష్ట్యానే పొత్తులు ఉంటాయని వివరణ
ఏపీలో సీఎం జగన్ ను పదవి నుంచి దించడంపై బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పేర్కొన్నారు. దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వివరణ ఇచ్చారు. బీజేపీతో త్వరలోనే రోడ్ మ్యాప్ ఖరారవుతుందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓ మార్పు జరగాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలితే ఏపీకి నష్టమని అభిప్రాయపడ్డారు. ఎవరెవరితో పొత్తులు అనేది ఇప్పుడే చెప్పలేమని, పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందని నాదెండ్ల పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకునే ఈ పొత్తులు ఉంటాయని, అయితే, వ్యక్తిగత అజెండాలను అందరూ పక్కనబెట్టాల్సిందేనని తెలిపారు. 

వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని, ఆ దిశగా శక్తుల ఏకీకరణ జరగాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను నాదెండ్ల మరింత బలపరిచారు. 151 సీట్లు ఉన్న పార్టీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎందుకు ప్రశ్నించదు? పోలవరంపై ఎందుకు మాట్లాడరు? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బలంగా ఎందుకు స్పందించరు? రాష్ట్రం ఏం తప్పుచేసింది? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ పోరాడాల్సిన సమయం వచ్చిందని, లేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని అన్నారు. జనసేన పార్టీకి భవిష్యత్ పై స్పష్టత ఉంది కాబట్టే నిన్నటి సభలో పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారని నాదెండ్ల వివరించారు.

Nadendla Manohar
Janasena
Alliance
Andhra Pradesh

More Telugu News